Blog
ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆరా – ఎయిమ్స్లో చికిత్స కొనసాగుతుంది
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ (73) ఛాతీలో నొప్పి, అసౌకర్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున ఎయిమ్స్లో చేరారు. ఉదయం 2 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్ను సందర్శించి, వైద్యులతో మాట్లాడారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించిన ఆయన, ధన్ఖడ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్య బృందం ఉపరాష్ట్రపతిని క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి పర్యవేక్షిస్తోంది. ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఉపరాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని రాజకీయ నేతలు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.